- జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులివ్వాలి
- హైదరాబాద్ అదనపు కలెక్టర్ కు హెచ్ యూజే - టీడబ్ల్యూజేఎఫ్ వినతి
- త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం
- అడ్ హక్ కమిటీ కన్వీనర్ పి రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే - టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని హెచ్ యూజే ఆధ్వర్యంలో శుక్రవారం(నవంబర్21) హైదరాబాద్ అదనపు కలెక్టర్ కదిరవన్ పలనికి జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు.
అడ్ హక్ కమిటీ కన్వీనర్ పి రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య, హెచ్ యూజే కార్యదర్శి బి జగదీశ్వర్ నేతృత్వంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు.
అనంతరం మీడియాతో రాంచందర్, బసవ పున్నయ్య మాట్లాడుతూ.. జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సూచించారు.
అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. గత సంవత్సరన్నర కాలంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువును మూడు నెలలకోసారి పొడిగిస్తూ వస్తున్నారు. స్టిక్కర్ విధానం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి కొత్త కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దాదాపు 40వేల మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. కానీ అవి కార్పొరేట్, ప్రవేట్ ఆస్పత్రుల్లో అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం అన్నారు. హైదరాబాద్ లో కేవలం నిమ్స్ ఆస్పత్రిలో మాత్రమే పాక్షికంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు కొత్త విధానం తేచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని, అదే విధానాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కంట్రిబ్యూషన్ మాత్రం ప్రభుత్వమే భరించాలని సూచించారు.
ఇటీవల జర్నలిస్టుల పై దాడులు పెరిగాయని, జర్నలిస్టులపై దాడులను నిరోధించేందుకు వెంటనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీస్, న్యాయ, రెవెన్యూ, సమాచార, జీఏడీ శాఖలతో కలిపి హైపవర్ కమిటీలను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక శాఖ పరిధిలో ఉన్న త్రైపాక్షిక కమిటీలను ప్రకటించి, సమావేశాలు ఏర్పాటు చేసి జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.
త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జర్నలిస్ట్ ల సమస్యలపై నివేదిస్తామని చెప్పారు. పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా హెచ్ యూజే- టీడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమం లో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, మాణిక్ ప్రభు, రాష్ట్ర కార్యదర్శి ఈ చంద్రశేఖర్, హెచ్ యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బి రాజశేఖర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు చిట్యాల మధుకర్, ఉపాధ్యక్షులు బి కాలేబ్, జి రేణయ్య, సంయుక్త కార్యదర్శులు వంగాల రమేష్, కే నర్సింహా, కార్యవర్గ సభ్యులు శ్రీధర్ మురహరి, కే వెంకటస్వామి, టీ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
